ETV Bharat / bharat

'అప్పటిలోగా నేమ్​ప్లేట్​లు మార్చుకోండి'- కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు- ఆస్తుల ధ్వంసంపై డీకే ఫైర్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 8:22 PM IST

Kannada Name Board Issue : వ్యాపార, వాణిజ్య సంస్థల నామఫలకాల్లో 60 శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం సిద్ధరామయ్య.

Kannada Name Board Issue :
Kannada Name Board Issue :

Kannada Name Board Issue : కర్ణాటకలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాల నామఫలకాల్లో 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. 60 శాతం కన్నడ అక్షరాలు, 40 శాతం ఇతర భాషాల అక్షరాలతో నామఫలకాలు ఉండేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్డినెన్స్‌ సంబంధించిన నియమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 28లోగా అన్ని కంపెనీలు, సంస్థలు, ఇతర దుకాణాలు తమ నేమ్‌ప్లేట్‌లను మార్చుకోవాలని సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాపారులంతా వీటిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.

భాష పరిరక్షణ పేరిట విధ్వంసాన్ని ఉపేక్షించం: డీకే శివకుమార్‌
కన్నడ పరిరక్షణ పేరిట ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఉపేక్షించబోమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హెచ్చరించారు. రాష్ట్ర భాషను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

"కన్నడ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారికి మేం వ్యతిరేకం కాదు. వారిని గౌరవిస్తాం. కానీ, విధ్వంసానికి పాల్పడితే ప్రభుత్వం కళ్లు మూసుకోదు. వారు నిరసన వ్యక్తం చేయవచ్చు. కానీ, ఆస్తులకు నష్టం కలిగించడం ఆమోదయోగ్యం కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తున్నారు. ప్రజలు తమ జీవనోపాధి కోసం ఇక్కడ నివసిస్తున్నారు. ఈ పరిణామాలు వారిలో భయాందోళనలు కలిగించకూడదు. కన్నడ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. అధికారిక కార్యకలాపాలు రాష్ట్ర భాషలోనే ఉండాలని ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని ఆదేశించారు. 60 శాతం కన్నడ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. దీన్ని ఉల్లంఘించినవారికి నోటీసులు జారీ చేయడం వంటి మార్గాలు ఉన్నాయి"
--డీకే శివకుమార్‌, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి

ఉద్రిక్తంగా కన్నడ పరిరక్షణ ర్యాలీలు
ఇదిలా ఉండగా వివిధ వాణిజ్య సంస్థలు కన్నడ భాషలో బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి మద్దతుగా కర్ణాటక రక్షణ వేదిక బుధవారం బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. హోటళ్లు, దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న నామఫలకాలను ఆందోళనకారులు తొలగించారు. 'కర్ణాటక రక్షణ వేదికె' అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ బుధవారం యలహంక సమీపంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఆంగ్లంలో ఉన్న నామఫలకాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల వాటిని బలవంతంగా తొలగించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటం వల్ల పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను నియంత్రించారు. ఆయా ఘటనల్లో దాదాపు 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. యలహంకలో అరెస్టయిన నారాయణగౌడ తదితరులను గురువారం తెల్లవారుజామున 5 గంటలకు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా, 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

Bangalore Bandh : బెంగళూరులో ప్రైవేట్​ వాహనాలు బంద్​.. సామాన్యుల ఇక్కట్లు.. బస్సులో ఇంటికి​ కుంబ్లే

'నేమ్​బోర్డుల్లో 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలి'- బెంగళూరులో ర్యాలీలు ఉద్రిక్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.