బిట్‌కాయిన్​ వల్ల భారీగా అప్పులు.. కూతుర్ని చంపి సూసైడ్​ యత్నం.. కిడ్నాప్​ డ్రామాతో జైలుపాలు

author img

By

Published : Nov 25, 2022, 12:08 PM IST

Stepmother Fed Poisoned Food To Children

బిట్‌కాయిన్​లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ వ్యక్తి.. కన్న కూతురినే చంపేశాడు. అనంతరం ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. కిడ్నాప్ డ్రామా ఆడి జైలుపాలయ్యాడు.

అనాలోచిత నిర్ణయం ఓ పసిపాప ప్రాణం తీసింది. అడ్డూఅదుపు లేకుండా అప్పులు చేసిన ఓ తండ్రి.. మూర్ఖత్వంతో సొంత కూతురునే హత్య చేశాడు. బిట్‌కాయిన్​లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఆ వ్యక్తి.. అధిక అప్పుల భారంతో ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. కూతురును ఎవరో ఎత్తుకెళ్లారని డ్రామా ఆడి, చివరకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్​లో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్​కు చెందిన రాహుల్​.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగి. ఆరు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన భవ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరు, బగలూరు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్​లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. అయితే రాహుల్​ 2016 నుంచి బిట్​కాయిన్​లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఇందులో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు సైతం చేశాడు. సంవత్సరం క్రితమే ఉద్యోగాన్ని మానేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికొచ్చి అడగడం మొదలు పెట్టారు.

మనస్తాపానికి గురైన రాహుల్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్​ 16న కూతురిని స్కూల్​కు​ తీసుకు వెళుతున్నానని భార్యకు చెప్పిన రాహుల్​.. పాపతో బయటకు వెళ్లాడు. కోలార్‌ జిల్లా కెందట్టి గ్రామం చెరువు వద్దకు చేరుకున్నాడు. ముందుగా కూతురిని గొంతు నులిమి చంపి, అనంతరం ఆమెతో పాటు నీటిలో దూకాడు. చెరువు తక్కువ లోతు ఉన్న కారణంగా రాహుల్​ చనిపోలేదు. భయాందోళనకు గురైన రాహుల్​ కూతురు శవాన్ని అక్కడే విడిచిపెట్టి, పర్స్, సెల్​ఫోన్​ తన కారులో పెట్టి బంగరపేట్​ రైల్వే స్టేషన్​కు వెళ్లాడు. అక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, దిల్లీ, ఆగ్రా తదితర ప్రాంతాలు తిరిగాడు. మధ్యలో ఎక్కడైనా రైలు నుంచి దూకి చనిపోదామని అనుకున్నాడు. అది వీలు కాలేదు.

father killed daughter
కూతురిని చంపిన తండ్రి

అయితే ఈ మొత్తం తతంగంలో ఒ కట్టు కథ సృష్టించాడు రాహుల్​. కూతురు కిడ్నాప్​నకు గురైందని భార్య భవ్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఘటనపై పోలీసులకు ఆశ్రయించింది భవ్య. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. నవంబర్ 23న ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగుళూరు వెళుతున్న రైలులో రాహుల్​ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విషయం అంతా వెలుగులోకి వచ్చిందని కోలార్ పోలీసులు తెలిపారు. రాహుల్​పై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.

పిల్లలకు చికెన్​లో విషం కలిపి..
తన భర్త మొదటి భార్య పిల్లలకు విషమిచ్చి చంపాలని చూసింది ఓ సవతి తల్లి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. సునీల్​ సోరైన్, ఝార్ఖండ్ గిరిదిహ్ జిల్లాలోని రోహంతాండ్ చెందిన వ్యక్తి. మొదటి భార్య రెండెళ్ల క్రితం పాటు కాటుకు గురై చనిపోయింది. అప్పటికే ఆమె ఒక కూతురు, నలుగురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. కాగా ఈ సంవత్సరం ఏప్రిల్​లో సునీల్... గోరియాచు గ్రామానికి చెందిన సునీత హన్డ్సా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు లేరు.

సెప్టెంబర్​లో మొదటి భార్య పిల్లలందరినీ వాళ్ల తాతయ్య, నానమ్మ దగ్గర వదిలిన సునీత.. భర్తతో కలిసి దుర్గాపూజ కోసం సొంతూరుకు వెళ్లింది. పూజ అనంతరం సునీల్ ఉపాధి కోసం బెంగళూరు వెళ్లాడు. బుధవారం రోహంతాండ్​కు వచ్చిన సునీత.. గురువారం ఉదయం అనిల్ సోరైన్(3), శంకర్ సోరైన్(8), విజయ్ సోరైన్(12)కు చికెన్​లో విషం కలిపి తినిపించింది. వారి ఆరోగ్యం క్షీణించిన అనంతరం పారిపోయింది. ఘటనలో అనిల్​ సోరైన్ మృతి చెందగా, శంకర్ సోరైన్ పరిస్థితి విషమం​గా ఉంది. విజయ్ సోరైన్ ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.