ETV Bharat / bharat

ఈడీ కస్టడీకి దిల్లీ మంత్రి.. ఫరూక్​పై ప్రశ్నల వర్షం.. డీకేకు సమన్లు

author img

By

Published : May 31, 2022, 4:56 PM IST

Satyendra Jain ED Custody: హవాలా కేసులో సోమవారం అరెస్టైన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్​ను ఈడీ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది ప్రత్యేక కోర్టు. మరోవైపు జేకేసీఏ కుంభకోణంలో ఎన్​సీ అధ్యక్షుడు ఫరూక్​ అబ్దుల్లాను ఈడీ మంగళవారం ప్రశ్నించింది. 2018- మనీలాండరింగ్​ కేసుకు సంబంధించి కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​కు దిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.

Delhi court sends Satyendra Jain to ED custody till June 9 in money laundering case
Delhi court sends Satyendra Jain to ED custody till June 9 in money laundering case

Satyendra Jain ED Custody: దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కస్టడీకి అప్పగించింది రౌస్​ అవెన్యూ ప్రత్యేక సీబీఐ కోర్టు. మనీలాండరింగ్​ కేసు విచారణలో భాగంగా జూన్​ 9 వరకు పోలీసులకు సహకరించాలని ఆయనకు స్పష్టం చేసింది. పెద్ద కుట్రను వెలికితీసేందుకు కస్టడీ విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయల్​. కోల్​కతా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థతో సంబంధమున్న హవాలా కేసులో ఆయన్ను సోమవారం అదుపులోకి తీసుకుంది ఈడీ. జైన్​ కుటుంబం, కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్​ చేసినట్లు గత నెలలో ఈడీ పేర్కొంది.

ఈడీ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. 2015-17 మధ్యలో జైన్​ దిల్లీ నుంచి కోల్​కతాకు హవాలా రూపంలో డబ్బులు పంపారని కోర్టుకు తెలిపారు. షెల్​ కంపెనీలు అన్నీ కోల్​కతాలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జైన్​కు మధ్యంతర బెయిల్​ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఈడీ ఆరోపణలన్నీ నిరాధారమైనవేనన్న జైన్​ తరఫు న్యాయవాది.. బెయిల్​కు సంబంధించిన విచారణ జరగాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇరువురి వాదనల అనంతరం.. జైన్​ను ఈడీ కస్టడీకి పంపుతూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ED grills Farooq Abdullah: జమ్ముకశ్మీర్ క్రికెట్​ అసోసియేషన్​ (జేకేసీఏ) కుంభకోణం కేసులో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్​సీ) పార్టీ అధ్యక్షుడు ఫరూక్​ అబ్దుల్లా మంగళవారం.. ఎన్స్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫరూక్​ను మూడున్నర గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. జమ్ముకశ్మీర్​లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే.. తనను ఇరుకునపెట్టాలని కేంద్రం చూస్తున్నట్లు ఆరోపించారు ఫరూక్​. జేకేసీఏకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ. 43.69 కోట్లు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణతో ఫరూక్​ సహా పలువురిపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకే రంగంలోకి దిగిన ఈడీ.. 2019 జులైలో ఫరూక్​ను తొలిసారి ప్రశ్నించింది.

Delhi Court Summons D K Shivakumar: మరోవైపు మనీలాండరింగ్​ కేసుకు సంబంధించి కర్ణాటక ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు డీకే శివకుమార్​కు సమన్లు జారీ చేసింది దిల్లీ కోర్టు. జులై 1న తమ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. పన్ను ఎగవేత సహా కోట్లాది రూపాయల హవాలా లావాదేవీల ఆరోపణలతో 2019 సెప్టెంబర్​ 3న శివకుమార్​ను అరెస్టు చేసింది ఈడీ. కొద్దిరోజులు కస్టడీలో ఉన్న అనంతరం 2019 అక్టోబర్​ 23న ఆయనకు బెయిల్​ మంజూరైంది. అదే కేసులో ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.

ఇవీ చూడండి: రాజ్యసభ పోరు రసవత్తరం.. రాజస్థాన్​ కాంగ్రెస్​లో చీలిక!.. ఝార్ఖండ్​లోనూ..

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.