జమ్ము కశ్మీర్లోని నగ్రోటా ప్రాంతంలో నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సరిహద్దు రక్షణ దళం.. వారి చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించిన సొరంగాన్ని ఇదివరకే గుర్తించిన బీఎస్ఎఫ్.. దాని ముఖభాగాన్ని కనిపెట్టేందుకు 200 మీటర్ల మేర పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది.
ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసిన వెంటనే.. వారు ఎలా వచ్చారనే విషయంపై బీఎస్ఎఫ్ విచారణ ప్రారంభించిందని అధికారులు తెలిపారు. భారత్వైపు గుర్తించిన సొరంగాన్ని అనుసరిస్తూ ముఖభాగాన్ని కనుగొన్నట్లు చెప్పారు. ఉగ్రవాదుల సెల్ఫోన్లలోని ఎలక్ట్రానిక్, భౌగోళిక సమాచారాన్ని ఇందుకోసం ఉపయోగించినట్లు తెలిపారు.
"సొరంగం ముఖ భాగం ఉన్న ప్రాంతం పాకిస్థాన్ భూభాగంలో 200 మీటర్ల లోపల ఉందని బీఎస్ఎఫ్ బృందం గుర్తించింది. ఆధారాల కోసం పాకిస్థాన్ భూభాగంలో సొరంగం చిత్రాలను తీసుకుంది."
-అధికారులు
నగ్రోటాలో నవంబర్ 19న జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బాన్ టోల్ప్లాజా వద్ద ఓ ట్రక్కులో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు తనిఖీలు నిర్వహించి.. వారిని మట్టుబెట్టాయి.
ఇదీ చదవండి- 'నగ్రోటా ఉగ్రదాడి.. ఆ సంస్థ ప్రణాళిక ప్రకారమే'