ETV Bharat / bharat

షోపియాన్​ ఎన్​కౌంటర్​ కేసులో కీలక మలుపు

author img

By

Published : Sep 18, 2020, 7:25 PM IST

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో జులై 18న జరిగిన ఎన్​కౌంటర్​పై అనుమానాలు నిజమనేందుకు ప్రాథమిక ఆధారాలు లభించాయని సైన్యం వెల్లడించింది. బాధ్యులపై చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది.

Shopian encounter
షోపియాన్​ ఎన్​కౌంటర్​ కేసు కీలక మలుపు

జమ్ముకశ్మీర్​ షోపియాన్​​ ఎన్​కౌంటర్​ కేసు కీలక మలుపు తిరిగింది. జులై 18న జరిగిన వివాదాస్పద ఆపరేషన్​లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉల్లంఘించి.. జవాన్లు వ్యవహరించారనేందుకు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు భారత సైన్యం వెల్లడించింది. సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది.

అసలు ఏమైంది?

జులై 18న దక్షిణ కశ్మీర్​ షోపియాన్​ జిల్లా అమ్షిపురా గ్రామంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించింది. అయితే.. ఆ ముగ్గురు జమ్ములోని రాజౌరీ జిల్లాకు చెందినవారని, అమ్షిపురాలో తప్పిపోయారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి. అమ్షిపురాలోని యాపిల్​, వాల్​నట్​ తోటల్లో కూలీలుగా పనిచేసే ఆ ముగ్గురు కనిపించకుండా పోయారని వారి కుటుంబ సభ్యులు జులై 17న పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో విచారణ జరిపింది సైన్యం. జులై 18న జరిగిన ఆపరేషన్​ విషయంలో సుప్రీంకోర్టు ఆమోదించిన నిబంధనావళిని జవాన్లు ఉల్లంఘించారని గుర్తించింది. ఆ ముగ్గురికి ఉగ్రవాదంతో సంబంధం ఉందా లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోందని, ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పింది. అయితే.. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది సైన్యం వెల్లడించలేదు.

ఇదీ చదవండి: ముంబయిలో సిలిండర్ పేలుడు- భవనం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.