ETV Bharat / bharat

భూషణ్​ కేసు: రూపాయి జరిమానా లేదా మూణ్నెల్లు జైలు

author img

By

Published : Aug 31, 2020, 5:08 PM IST

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు భారత అత్యున్నత న్యాయస్థానం ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సెప్టెంబర్​ 15లోపు కోర్టుకు డిపాజిట్ చేయాలని, లేదంటే మూణ్నెల్లు జైలు, మూడేళ్ల పాటు ప్రాక్టీస్​పై నిషేధం విధిస్తామని హెచ్చరించింది.

SC-BHUSHAN-CONTEMPT
కోర్టు ధిక్కరణ కేసు

కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ట్వీట్లు చేసిన కేసులో న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు భారత్ అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. భూషణ్​కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. సెప్టెంబర్‌ 15లోగా రూపాయిని కోర్టుకు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

డిపాజిట్‌ చేయకపోతే 3 నెలల జైలుశిక్ష, మూడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయకుండా నిషేధం విధిస్తామని తీర్పులో హెచ్చరించింది.

న్యాయమూర్తులపై అవినీతికి సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు అంతర్గత విధానం ఉందనే విషయాన్ని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చెబుతున్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా విచారణ సందర్భంలో అభిప్రాయపడ్డారు. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని, అయితే ఇతర హక్కులను కూడా గౌరవించాలని ధర్మాసనం స్పష్టంచేసింది.

నాలుగు రోజుల సమయం..

సుప్రీంకోర్టు జడ్జిలు, కోర్టులపై భూషణ్ చేసిన ట్వీట్లను సుమోటోగా స్వీకరించి కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ప్రశాంత్‌ భూషణ్‌ను దోషిగా తేలుస్తూ ఆగస్టు 14న సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించింది. ఆయనపై చర్యలకు అవకాశం కలిపిస్తూ క్షమాపణ చెప్పేందుకు నాలుగురోజుల సమయం ఇచ్చింది.

కానీ, ప్రశాంత్ భూషణ్ మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఫలితంగా ఆగస్టు 25న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు... సోమవారం శిక్ష ఖరారు చేసింది.

భూషణ్​ ఏమన్నారంటే..

"నా ట్వీట్లు న్యాయస్థానాన్ని అగౌరవపరిచే ఉద్దేశంతో చేయలేదు. కానీ నా ఆవేదనను వ్యక్తపరిచేందుకు చేసినవి. వాటిని తప్పుగా భావించారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛకు నీళ్లు వదిలేసిన క్షణం. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలని చాలా మంది ప్రోత్సహించినట్లు అనిపిస్తోంది" అని తీర్పు అనంతరం ప్రశాంత్ భూషణ్​ మాట్లాడారు.

రూపాయి విరాళం..

అయితే కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఆయన న్యాయవాది, సీనియర్‌ సహచరుడు రాజీవ్‌ ధావన్‌ జరిమానా మొత్తం రూపాయిని తనకు విరాళంగా ఇచ్చినట్లు ప్రశాంత్‌ భూషణ్‌ వెల్లడించారు. ఈ విరాళాన్ని తాను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాని ప్రశాంత్‌ భూషణ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

  • My lawyer & senior colleague Rajiv Dhavan contributed 1 Re immediately after the contempt judgement today which I gratefully accepted pic.twitter.com/vVXmzPe4ss

    — Prashant Bhushan (@pbhushan1) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏం జరిగింది?

సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ జున్‌ 27న, 29న చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. తొలి ట్వీట్‌లో ఆయన గతంలో పనిచేసిన నలుగురు సుప్రీం కోర్టు సీజేఐల పనితీరును తప్పుబట్టారు. 29న చేసిన ట్వీట్‌లో ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని, ఓ పార్టీ నాయకుడి బైకు నడిపారని ఆరోపించారు. దీంతోపాటు ఆయన సుప్రీం కోర్టు లాక్‌డౌన్‌లో ఉంచి పౌరులకు న్యాయాన్ని దూరం చేశారన్నది ఆ ట్వీట్‌ సారాంశం.

బైకు ఎవరిది?

ముఖ్యంగా రెండో ట్వీట్‌లో బైకు ఓ పార్టీ నాయకుడిదని పేర్కొన్నారు. ఆ చిత్రంలో స్పష్టంగా హార్లీడేవిడ్‌సన్‌ లోగో ఉన్న టీషర్ట్‌ ధరించిన షోరూం సిబ్బంది కనిపిస్తున్నారు. అది షోరూమ్‌ నుంచి డెమో కోసం తెచ్చిన బైకుగా తేలింది.

జస్టిస్​ ఎస్‌ఏ బోబ్డేకు బైకులు అంటే ఇష్టం. ఆయన ఈ విషయాన్ని గతంలో 2019 అక్టోబర్‌ 31న ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ కూడా చెప్పారు. తాను బుల్లెట్‌పై సవారీకి వెళ్లేవాడినని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అసలెవరీ ప్రశాంత్‌ భూషణ్​? ఆయన ఏమన్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.