ETV Bharat / bharat

హస్తిన అల్లర్లపై ఎన్​హెచ్​ఆర్​సీ నిజ నిర్ధరణ కమిటీ

author img

By

Published : Mar 1, 2020, 6:50 AM IST

Updated : Mar 3, 2020, 12:49 AM IST

ఈశాన్య దిల్లీ అల్లర్ల అనంతరం.. దేశ రాజధాని క్రమక్రమంగా కోలుకుంటోంది. ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారు. హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేసేందుకు నిజ నిర్ధరణ కమిటీని నియమించింది జాతీయ మానవ హక్కుల కమిషన్​(ఎన్​హెచ్​ఆర్​సీ).

NHRC forms fact-finding team to probe violence in northeast Delhi
హస్తిన అల్లర్లపై ఎన్​హెచ్​ఆర్​సీ నిజ నిర్ధరణ కమిటీ

హస్తిన అల్లర్లపై ఎన్​హెచ్​ఆర్​సీ నిజ నిర్ధరణ కమిటీ

కొద్ది రోజుల క్రితం దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్ల ఘటనపై దర్యాప్తు చేసేందుకు నిజ నిర్ధరణ కమిటీని నియమించింది జాతీయ మానవ హక్కుల కమిషన్​. ఘటన వెనుక వాస్తవాలను వెలికితీయనుంది కమిటీ. ఈ సందర్భంగా అల్లర్లు జరిగిన ప్రాంతాల సందర్శనతో పాటు.. బాధితులను కలవనున్నారు బృందం సభ్యులు. ఈశాన్య దిల్లీ పోలీసు విభాగాన్ని కూడా ఘటనపై ఆరా తీయనున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.

గత ఆదివారం ఈశాన్య దిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. 3 రోజుల పాటు దిల్లీ అట్టుడికింది. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.

ఘటనా సమయంలో దుండగులు రెచ్చిపోయారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, వాహనాలకు నిప్పంటించారు. ప్రజలు, పోలీసులు ఒకరిపై మరొకరు పెట్రోల్​ బాంబులు, రాళ్లు విసురుకొని విధ్వంసం సృష్టించారు. గత 3 దశాబ్దాల్లో ఈశాన్య దిల్లీలో ఇవే అత్యంత తీవ్రమైన అల్లర్లుగా పేర్కొంటున్నారు.

పాఠశాలల బంద్​ పొడిగింపు...

అల్లర్లు చెలరేగిన 3 రోజుల తర్వాత నుంచి ఈశాన్య దిల్లీలో పరిస్థితులు మెల్లమెల్లగా అదుపులోకి వస్తున్నాయి. అయినప్పటికీ ఘర్షణలు చెలరేగిన ప్రాంతాల్లోని పాఠశాలలకు మార్చి 7 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వార్షిక పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేని కారణంగా.. స్కూళ్ల పునఃప్రారంభం ఇప్పుడే సాధ్యపడదని అధికారులు స్పష్టం చేశారు.

Last Updated : Mar 3, 2020, 12:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.