ETV Bharat / bharat

తేజస్వీ.. ఆటవిక రాజ్యానికి రాకుమారుడు: మోదీ

author img

By

Published : Oct 28, 2020, 7:13 PM IST

బిహార్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​పై ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. ఆటవిక రాజ్యానికి యువరాజు అంటూ తేజస్వీపై నిప్పులు చెరిగారు. 10 లక్షల ఉద్యోగాల హామీని ఎగతాళి చేశారు. లాలూ హయాంలో బిహార్​ను రోగగ్రస్థ రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.

BH-POLL-PM-RALLY
మోదీ

బిహార్​లో మహా కూటమి సీఎం అభ్యర్థి, ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. బిహార్​లోని దర్భంగ, ముజఫర్​పుర్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. తేజస్వీ 10 లక్షల ఉద్యోగాల హామీని ప్రస్తావిస్తూ పదునైన వ్యాఖ్యలతో మోదీ ధ్వజమెత్తారు.

"ప్రభుత్వ ఉద్యోగాల గరించి పక్కనపెట్టండి. వాళ్లు అధికారంలోకి వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పోతాయి. కిడ్నాప్‌లో వారి కుటుంబానికి కాపీరైట్లు ఉన్నాయి. దోపిడీలతో కంపెనీలు మూసేయాల్సి వస్తుంది. అధికారం కోసం ఖాళీ హామీలు ఇస్తున్నారు. తేజస్వీ యాదవ్ బిహార్‌కు కాబోయే యువరాజు కాదు, ఆటవిక రాజ్యానికి రాకుమారుడు.

బిహార్‌లో ఎన్​డీఏ ప్రభుత్వం వచ్చాకే మార్పు వచ్చింది. నితీశ్​ ప్రభుత్వం బిహార్‌ను అభివృద్ధి వైపు నడిపించింది. ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. బిహారీల ఆశలను, ఆశయాలను నెరవేర్చేది ఎన్​డీఏ మాత్రమే. బిహార్​ను సమూలంగా మార్చిన పార్టీకి ఓటు వేసే అవకాశం ఇది."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

బీమార్ రాష్ట్రంగా..

బిహార్​కు ప్రస్తుతం రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయని మోదీ అన్నారు. ఒకటి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కాగా.. రెండోది రాష్ట్రాన్ని రోగగ్రస్థంగా మార్చిన శక్తుల నుంచి ముప్పు ఉంది. ఈ ప్రమాదాల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఎన్​డీఏకు ముందు లాలూ-రబ్​రీ దేవి 15 ఏళ్ల పాలనపైనా మోదీ విమర్శలు గుప్పించారు. అబద్ధాలు, మోసం, గందరగోళంలోనే వారి ప్రభుత్వం కొనసాగిందన్నారు. బిహార్​ అభివృద్ధి కోసం వారి వద్ద ఎలాంటి ప్రణాళిక కానీ, అనుభవం కానీ లేవన్నారు.

ఇదీ చూడండి: భాజపా అనుకుంటే.. పని అయిపోయినట్టే: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.