మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొత్తగా 8,968 మందికి వైరస్ సోకగా... మొత్తం బాధితుల సంఖ్య 4,50,196కు చేరింది. మరో 266 మృతితో.. మరణాల సంఖ్య 15,842 కు పెరిగింది.
కర్ణాటకలో పదిరోజుల తర్వాత..
కర్ణాటకలో కరోనా కేసులు స్వల్పస్థాయిలో తగ్గాయి. వరుసగా 10 రోజుల పాటు 5వేలకుపైగా నమోదుకాగా.. పదిరోజుల తర్వాత తొలిసారి 4,752 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,39,571కు పెరిగింది. వైరస్ ధాటికి మరో 98 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య 2,594కు చేరింది.
వైరస్ నుంచి కోలుకొని సోమవారం 4,776 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఫలితంగా ఇప్పటివరకు మొత్తం 62,500 మందికి వైరస్ నయమైనట్లయింది. మరో 74,469 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
గుజరాత్లో 2,500దాటిన మరణాలు..
గుజరాత్లో తాజాగా 1,009 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 64,684 కు చేరింది. వైరస్ బారినపడిన మరో 22 మంది మరణించారు. ఫలితంగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,509 కు పెరిగింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 47,561 మందికి వైరస్ నయమైంది. మరో 14,614 మంది చికిత్స పొందుతున్నారు.
బంగాల్లో అలా..
పశ్చిమబంగాలో కొత్తగా మరో 2,716 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. ఫలితంగా మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 78,232కు చేరింది. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,731కు పెరిగింది.
మణిపుర్లో 300 పడకల ఆసుపత్రి..
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో వైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరెన్.. ఇంపాల్లో 300 పడకల కొవిడ్ కేర్ సెంటర్(సీసీసీ)ను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 2,920 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 1,147 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 1,766 మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: తమిళనాట తగ్గని కరోనా- కొత్తగా 5,609 కేసులు