ఇంటి అవసరాల కోసం విద్యుత్ని 87 శాతం మంది ప్రజలు దేశీయ గ్రిడ్ల పై ఆధారపడుతున్నట్లు నీతి ఆయోగ్, అమెరికాకు చెందిన రాక్ఫెల్లర్ ఫౌండేషన్ చేపట్టిన ఉమ్మడి సర్వేలో తేలింది. కేవలం 13 శాతం మంది మాత్రమే కరెంట్ కోసం ఇతర ప్రత్యామ్నాయాలను వినియోగించుకొంటున్నారని వెల్లడైంది. వీరిలో కొంతమంది విద్యుత్ వినియోగించుకోని వారు కూడా ఉన్నారని తెలిపింది.
ఈ సర్వే పది రాష్ట్రాల్లో నిర్వహించగా.. పాతికవేల మంది పాల్గొన్నారు. ఈ సర్వే ప్రధానంగా విద్యుత్ వినియోగదారుల సంతృప్తి, క్షేత్ర స్థాయిలో వినియోగం, వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలకు కరెంట్ ఉపయోగించే వారిపై జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సర్వే ఫలితాలను స్మార్ట్ పవర్ ఇండియా విడుదల చేసింది.
సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు
- 87 శాతం మంది విద్యుత్ కోసం గ్రిడ్లపై ఆధార పడుతున్నారు.
- 13 శాతం ప్రజలకు కరెంట్ అందుబాటులో లేకపోవడం లేదా సౌర విద్యుత్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
- ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడిన వారిలో 62 శాతం మంది వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు.
- నాలుగు శాతం మందికి విద్యుత్ సరఫరా లేదు.
- 66 శాతం ప్రజలు విద్యుత్ సరఫరాపై సంతృప్తిగా ఉన్నారు.
- పట్టణ జనాభాలో 75 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా... గ్రామీణుల్లో మాత్రం సంతృప్తిదారుల శాతం 63గా ఉంది.
- విద్యుత్ వినియోగంలో ఉత్తర్ప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే వెనకంజలో ఉంది.
- 20 ఏళ్లలో గ్రిడ్ పవర్ను ఉపయోగించకునే వారి సంఖ్య 59.4 శాతం పెరిగింది.
దేశంలో వంద శాతం గృహాలకు విద్యుత్ సరఫరా కల్పించినపట్టకీ... స్థిరమైన సేవలను కొనసాగించడం పెద్ద సవాలుగా మారిందని స్మార్ట్ పవర్ ఇండియా సీఈవో ముఖర్జీ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించే సమయం ఆసన్నమైందని తెలిపారు.