రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల అందోళన - సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2024, 11:51 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-01-2024/640-480-20549647-1090-20549647-1705685482591.jpg)
Teachers Agitation in Andhra Pradesh : ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ సరెండర్లు లీవ్ల నగదును చెల్లించాలని కోరారు. కడపలో మహావీర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 18 వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలిలో చెవిలో పూలు పెట్టుకుని, సర్కారు వైఖరికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. 30 శాతం ఐఆర్ తో పాటు 12వ పీఆర్సీ విధివిధానాలను వెంటనే రూపొందించాలని నినదించారు.