డబ్బులన్నీ డిపాజిట్ చేయించింది - ఖాతాలు చూస్తే ఖాళీ 'వందల మంది బాధితుల ఆందోళన'
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 12:34 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-01-2024/640-480-20559719-thumbnail-16x9-postmaster-fraud-in-kadapa-district.jpg)
Postmaster Fraud in Kadapa District: వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం పందిలపల్లి గ్రామస్థులకు ఓ పోస్ట్మాస్టర్ టోకరా వేసి నగదు స్వాహా చేసింది. పందిలపల్లి పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న ఉమాదేవి వద్ద గ్రామస్థులు నగదు డిపాజిట్ చేశారు. ఇటీవలె గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఖాతాలో నగదు చెక్ చేయమని ఉమాదేవిని కోరగా, తర్వాత చేస్తానంటూ దాటవేసిందని సదరు మహిళ తెలిపారు. అనుమానం వచ్చి ఎర్రగుంట్ల పోస్ట్ ఆఫీస్లో నగదు విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లగా, ఖాతాలో ఎటువంటి సొమ్ము లేదని తెలియడంతో ఆమె ఆందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు తమ ఖాతాలను సరిచూసుకోగా వారి ఖాతాలన్నీ నకిలీవి అని తేలాయి. మోసపోయామని గ్రహించిన వారంతా పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాము పోస్ట్మాస్టర్ ఉమాదేవిని నమ్మి నగదును ఆర్డీ రూపంలో ఆమెకు చెల్లించినట్లు గ్రామస్థులు వివరించారు. దీంతో ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. బాధితుల ఆందోళనలతో పోస్ట్ మాస్టర్ ఉమాదేవిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎంత మొత్తంలో స్కామ్ జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.