మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ - ఎన్నికల్లో ఓటేసేదే లేదన్న గ్రామస్థులు
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2024, 4:03 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/640-480-20474895-thumbnail-16x9-protest-against-peddireddy.jpg)
Villagers Protest Against Minister Peddireddy Ramachandra Reddy: శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి (Minister Peddireddy Ramachandra Reddy) నిరసన సెగ తగిలింది. మండలంలోని మనేంపల్లి అనే గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటించి తిరిగి వెళుతున్న సమయంలో మండలంలోని గౌరీగానిపల్లి గ్రామస్థులు తమ గ్రామానికి రోడ్డు లేదంటూ మంత్రిని అడ్డుకొని ప్రశ్నించారు. హిందూపురం అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని అన్నారు.
గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి వచ్చే సమయంలో నిరసనకారులను పోలీసులు బలవంతంగా పక్కకు తోసేశారు. సమస్యను పరిశీలించి పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గౌరిగానపల్లి గ్రామస్థులు సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే ఎన్నికల్లో తాము ఓటు వేసేది లేదంటూ తెగేసి చెప్పారు.