'ఉయ్యాలవాడను అవమానిస్తారా?' - విగ్రహావిష్కరణపై జేసీ డెడ్లైన్
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2024, 7:11 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/640-480-20476077-thumbnail-16x9-jc-prabhar-reddy.jpg)
Uyyalawada Narsimha Reddy Statue Controversy : అనంతపురంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి విగ్రహం ఆవిష్కరిస్తారా లేదా అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనంత రామిరెడ్డిని ప్రశ్నిస్తూ మీరు ఆవిష్కరించకపోతే తానే ఆవిష్కరిస్తానని జేసీ పేర్కొన్నారు. తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడైన ఉయ్యాలవాడను అవమానిపరిచేలా వెంకటరామిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. బ్రిటీష్ వారి చర్యలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం వల్లనే ఉయ్యాలవాడని కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఉరితీశారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరంలో బలిదానం ఇచ్చిన ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటు రాయలసీమ ప్రజల ఆత్మాభిమానానికి సంబంధించిదని తెలియజేశారు.
ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డిని ఒక రెడ్డి కులానికి చెందిన వ్యక్తిగా కాకుండా సమరయోధుడిగా మాత్రమే చూడాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై నిర్లక్ష్యం చేస్తున్నారని జేసీ విమర్శించారు. రాష్ట్రంలో ఏ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికీ లేని అనుమతి ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటుకు మాత్రం ఎందుకని ప్రశ్నించారు. సోమవారం లోపు ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి విగ్రహానికి వేసిన ముసుగును తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే విగ్రహం ముసుగును తానే స్వయం తొలగిస్తానని జేసీ హెచ్చరించారు.