Turmeric farmers meet Lokesh in Yuvagalam : అధికారంలోకి వచ్చాక పసుపు పంటపై ప్రత్యేక దృష్టి.. రైతులకు హామీ ఇచ్చిన లోకేష్
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-08-2023/640-480-19274725-thumbnail-16x9-lokesh-accused-the-ysrcp-government.jpg)
Turmeric farmers meet Lokesh in Yuvagalam : వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రంలో రైతాంగం నానా అగచాట్లు పడుతోందని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ను నిడమర్రు సెంటర్ లో దుగ్గిరాలకు చెందిన పసుపు రైతులు కలిశారు. నాణ్యమైన పసుపు విత్తనం దొరకటం లేదని, రైతులు నారా లోకేశ్ దృష్టికి తెచ్చారు. అలాగే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని లోకేశ్ ముందు వాపోయారు. వైసీపీ పాలనలో ఉద్యాన శాఖ నుంచి ఎటువంటి రాయితీలూ రావడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన నారా లోకేశ్... రైతులకు అవసరమైన విత్తనాలను కూడా సరఫరా చేయకపోవడం, ఈ ప్రభుత్వ దివాలాకోరుతనానికి అద్దం పడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పసుపుపంటకు రాయితీలు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్యుత్ తో పాటు పసుపు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని లోకేశ్ వెల్లడించారు. మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.