TTD EO Dharma Reddy: "స్విమ్స్లో క్యాన్సర్కు అత్యుత్తమ చికిత్స"
TTD EO Dharma Reddy Speech in Cancer Awareness Program: స్విమ్స్లో ఏర్పాటు చేస్తున్న శ్రీ బాలాజీ ఇన్సిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (క్యాన్సర్ హాస్పిటల్)లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లలకు శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ పరీక్షలపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
క్యాన్సర్ వల్ల దేశంలో ఏటా 7 లక్షల మంది చనిపోతున్నారని.. తొలి దశలోనే గుర్తించడం, సరైన చికిత్స అందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించడానికి వీలవుతుందన్నారు. ప్రాణాయామం, యోగాకు సంబంధించి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆచార్యుల చేత మరో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ను దూరం చేయవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను క్యాన్సర్ రహిత ప్రాంతంగా తయారు చేయడానికి చేపట్టిన మహత్తర కార్యక్రమానికి టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. జిల్లాలో మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ గుర్తింపు కేంద్రాలను శాశ్వతంగా ఏర్పాటు చేస్తామన్నారు. రెండు పింక్ బస్లను అందించి అందులో డాక్టర్ సహా ఇతర అన్ని వసతులు సమకూరుస్తామని ఆయన తెలిపారు.