TTD EO Dharma Reddy: ఆనంద నిలయం చిత్రీకరణ నిజమే.. బాధ్యులపై చర్యలుంటాయి: తితిదే ఈవో
SECURITY FAILURE IN TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయ చిత్రీకరణ వాస్తవమేనని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నిందితుడు తెలంగాణలోని కరీంనగర్కు చెందిన రాహుల్ రెడ్డిగా సీసీ కెమెరాల ద్వారా భద్రత అధికారులు గుర్తించారన్నారు. తెలంగాణలో తిరుమల పోలీసులు నిందితుడు రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
తిరుమలలో 24 గంటల పాటు విద్యుత్తు ఉంటుందని, విద్యుత్తుకు అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పడం అవాస్తవమన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చి నిందితుడు చరవాణిని తీసుకొని వెళ్లారన్నారు. భద్రత అధికారుల నివేదిక రాగానే సెక్యూరిటీ సిబ్బంది, నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆలయ భద్రతపై సమీక్షిస్తామని ఆయన చెప్పారు.
తిరుమలలో చిత్రీకరణ వాస్తవమే.. రాహుల్ రెడ్డి అనే భక్తుడు ఆనంద నిలయం వీడియో తీశాడు. ఎలా లోపలికి వెళ్లాడు ఎలా వీడియో తీశాడు అన్నది కూడా సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించుకోవడం జరిగింది. అతను చాకచక్యంగా లోపలికి వెళ్లడం జరిగింది. భద్రతా సిబ్బందిని ఏమార్చి లోపలికి కెమెరా తీసుకువెళ్లాడు. మరి ఎందుకు అలా చేశాడనేది పోలీసు విచారణలో బయటపడుతుంది. ఎవరి వల్ల అయితే భద్రతా లోపం జరిగిందో నిర్ధారించి వారిపై చర్యలు తీసుకుంటాం. - తితిదే ఈవో ధర్మారెడ్డి