Guntur Council Meet బోగస్ ఓట్లపై గుంటూరు కౌన్సిల్ సమావేశంలో తీవ్ర వాగ్వాదం..
Argument Guntur Municipal Corporation Council Meeting: గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతల నడుమ ముందుకు సాగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒకే ఇంటి నంబర్పై బోగస్ ఓట్లు ఉన్నాయంటూ.. వాటిని తక్షణమే తొలగించాలని కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. సచివాలయ అధికారులు ఉండగా.. ఓటర్ల సర్వే వాలంటీర్లతో ఎలా చేయిస్తారని ప్రశ్నించారు. వాలంటీల్లతో సర్వే చేయించటం ద్వారానే తప్పిదాలు జరుగుతున్నాయని టీడీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు మేయర్ సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. దీంతో మేయర్ వారికి సమాధానం చెప్పకుండా మరో ప్రశ్నను లేవనెత్తారు. అగ్రహనికి గురైన కార్పొరేటర్లు మేయర్ ముందుకు వచ్చి.. సమాధానం చెప్పకుండా మరో ప్రశ్న కొలిక్కి తీసుకురావటం సభ మర్యాద కాదని నిలదీశారు. దీంతో సభలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే వైసీపీ కార్పొరేటర్లు స్పందిస్తూ.. వాలంటీర్లను అవమానించే విధంగా టీడీపీ కార్పొరేటర్లు ప్రవర్తిస్తున్నారని, వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు అంటే టీడీపీ కార్పొరేటర్లకు చులకన భావమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్ ఓట్లను పరిశీలిస్తామని.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు సమాధానం ఇవ్వటంతో టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన విరమించారు.