TDP on IPAC Organization సొమ్ము సర్కార్ది.. ప్రచారం పార్టీకి! ఐప్యాక్ కు 274కోట్లు దోచిపెట్టిన జగన్..
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 8:11 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-10-2023/640-480-19675715-thumbnail-16x9-tdp-vijay.jpg)
TDP Alleges YSRCP Govt Given Money to IPAC Organization: ఐప్యాక్ సంస్థకు 274 కోట్ల ప్రభుత్వ సొమ్మును వైసీపీ దోచిపెట్టిందని తెలుగుదేశం ఆరోపించింది. వైసీపీ ప్రచారం కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్ సంస్థకు.. వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో ఏటా 68కోట్ల రూపాయల చొప్పున ప్రజాధనాన్ని మళ్లించారని ఆరోపణలు గుప్పించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అని ధ్వజమెత్తింది.
వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో జిల్లాల వారీగా నియమించిన ఐప్యాక్ సిబ్బందికి.. ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా జీతాలు చెల్లిస్తున్నారని తెలుగుదేశం ఆరోపించింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్.. మొత్తం 274కోట్ల ప్రభుత్వ సొమ్ము మళ్లించారని అన్నారు. మూడు షెల్ కంపెనీలను కన్సార్షియంగా ఏర్పాటుచేసి.. అందులో ఓ సంస్థకు జీవో ఇచ్చి మరీ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లించినట్లు చెప్పారు. వాలంటీర్లపై పర్యవేక్షణ కోసమంటూ నియమించిన ఐప్యాక్ సిబ్బందికి.. షెల్ కంపెనీల కన్సార్షియంలోని రామ్ ఇన్ఫో సంస్థ ద్వారా జీతాలు చెల్లించినట్లు వివరించారు.
మూడు సంస్థల్ని ఎఫ్ఓఏగా పేర్కొన్న ప్రభుత్వం.. ఈ సేవల వినియోగం కోసం నిబంధనలేమైనా పాటించిందా అని విజయ్కుమార్ ప్రశ్నించారు. టెండర్లు పిలవడంతోపాటు 274కోట్ల చెల్లింపులకు అసెంబ్లీ, కేబినెట్ అనుమతి ఉందా అని నిలదీశారు. డిజిటల్ కార్పొరేషన్ సొమ్ములతో వైసీపీ సోషల్ మీడియా సోకులు పోతోందన్న విజయ్కుమార్.. ఈ కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడతామని చెప్పారు.