డ్రగ్స్ అడ్డాగా మారిన రాష్ట్రం - మత్తుకు బానిసలు కాకుండా పిల్లల్ని కాపాడుకుందాం : లోకేశ్
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 2:20 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-11-2023/640-480-20085070-thumbnail-16x9-tdp-lokesh-on-drug-mafiya-in-ap.jpg)
TDP Lokesh on Drug Mafiya in AP: ప్రజల ఆరోగ్యాలు కాపాడే భావి డాక్టర్లు గంజాయికి బానిసలై ఉన్మాదులుగా మారి కొట్టుకుని ఆసుపత్రిలో పేషెంట్లు అయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా మారాయని.. కర్నూలు, ఒంగోలు మెడికల్ కాలేజీలలో గంజాయి బ్యాచుల దాడులతో స్పష్టమైందని మండిపడ్డారు. మత్తుకి బానిసైన కొంతమంది మెడికోల హింసాప్రవర్తన చూశాక రాష్ట్రంలో పరిస్థితిపై భయమేస్తోందన్నారు. స్కూల్లో విద్యార్థులు గంజాయికి బానిసవడం యువగళం పాదయాత్రలో చూశానన్న లోకేశ్.. యువత భవిత నాశనం అవుతుందనే ఆందోళనతో ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందాలు కట్టడి చేయాలని ప్రధానమంత్రికి లేఖ రాశానని తెలిపారు.
అయినా ఏపీలో గంజాయి తీవ్రత మరింత పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వద్దని చెప్పాల్సిన కొంతమంది వైద్య విద్యార్థులే డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారంటే చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. పాలకులు పట్టించుకోరని, ప్రజలే డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం చేయాలని సూచించారు. వారికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పిల్లలు మత్తుకి బానిసలు కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు.