TDP Leaders Met Yuvagalam Volunteers in Central Jail: యువగళం వాలంటీర్లపై కేసులు పెట్టి వేధించడం దారుణం: చినరాజప్ప
TDP Leaders Met Yuvagalam Volunteers in Central Jail: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యువగళం వాలంటీర్లను తెలుగుదేశం బృందం పరామర్శించింది. మాజీ హోం మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో సెంట్రల్ జైలుకు వెళ్లి వాలంటీర్లను కలిసి నాయకులు ధైర్యం చెప్పారు. జవహర్, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు, వెంకటరమణ చౌదరి, కాశీనవీన్, దేవకృప తదితరులు వాలంటీర్లను కలిశారు. యువగళం పాదయాత్రలో దాడులు, కేసులతో అడ్డంకులు సృష్టిస్తున్నా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారని చినరాజప్ప అభిప్రాయపడ్డారు.
భీమవరం ఘటనలో యువగళం వాలంటీర్లకు దాడులతో ఎలాంటి సంబంధం లేదని చినరాజప్ప పేర్కొన్నారు. 38 మంది వాలంటీర్లపై కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపి వేధించడం దారుణమని అన్నారు. పోలీసులు కూడా పాదయాత్ర జరగకుండా ప్రభుత్వానికి తలొగ్గి అడ్డంకులు కలిగిస్తున్నారని కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. తాము అధికారంలో ఉండగా... జగన్ పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని, కానీ లోకేశ్ పాదయాత్రపై వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ టీడీపీ పోరాడుతోందని చినరాజప్ప పేర్కొన్నారు.