TDP Allegations on YCP Power Tariff Hike: జగన్ పాలనలో 8సార్లు విద్యుత్ చార్జీల పెంపు.. రూ.58 వేల కోట్ల దోపిడీ : ధూళిపాళ్ల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 3:36 PM IST

thumbnail

TDP allegations on YCP power tariff hike : విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో జగన్ ప్రభుత్వానికి ఈఆర్సీ (Electricity Regulatory Commission) సహకరిస్తోందని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర ఆరోపించారు. ప్రజలపై విద్యుత్ భారం మోపే పాపంలో ఈఆర్సీ కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. జగన్(Jagan) హయాంలో రూ.58 వేల కోట్ల విద్యుత్ దోపిడీ జరిగిందని మండిపడ్డారు. ప్రజల మీద విద్యుత్ భారాన్ని తగ్గించేలా ఈఆర్సీ ఎందుకు వ్యవహరించట్లేదని ప్రశ్నించారు. విద్యుత్ రంగంలో దోపిడీని ఈఆర్సీ అరికట్టలేకపోతోందని విమర్శించారు. జనం కోసం పని చేయాల్సిన ఈఆర్సీ(ERC) జగన్ దోపిడీకి సహకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రకరకాల పేర్లతో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని దుయ్యబట్టారు.

జగన్ హయాంలో రూ.20 వేల కోట్ల మేర విద్యుత్ భారం మోపారని నరేంద్ర ఆక్షేపించారు. ఈఆర్సీ గతంలో నిష్పక్షపాతంగా ఉండేది.. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఏం చెబితే ఈఆర్సీ వింటూ ఆమోదం ఇచ్చేస్తోందని ఆరోపించారు. అసలు ఈఆర్సీ పవర్ హాలిడే(Power Holiday) ప్రకటించడమేంటని నిలదీశారు. విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని, వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఎక్కడా కన్పించడం లేదని మండిపడ్డారు. కనీసం ఐదు గంటలైనా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరే పరిస్థితికి వచ్చారన్నారు. రైతులకు విద్యుత్ సరఫరా పేరుతో సెకీతో ఒప్పందం చేసుకుని దోపిడీకి తెర లేపిందని ఆరోపించారు. పరిశ్రమలకు ఉండే ఎలక్ట్రిసిటీ డ్యూటీ(Electricity Duty)ని ఆరు పైసల నుంచి ఒక రూపాయికి పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.