SP on rowdy sheeter murder రాజకీయ కోణం లేదు.. రెచ్చగొట్టే పోస్టింగ్స్ పెడితే చర్యలు.. రౌడీషీటర్ కిషోర్ హత్యపై ఎస్పీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 7:10 PM IST
SP on rowdy sheeter murder in Amalapuram: కోనసీమ జిల్లాలో రౌడీషీటర్ హత్య తరువాత ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం ఉంది. కాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి సమీపంలో ఉన్న ఈదరపల్లిలో నిన్న రౌడీషీటర్ కిషోర్ హత్య చేయడంతో పాటు సాయి లక్ష్మణ్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. హత్య నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీధర్ తెలిపారు.
కిషోర్ హత్య జరిగిన తర్వాత కొంతమంది దుండగులు అమలాపురం ఎర్ర వంతెన దిగువన అపార్ట్మెంట్ కింద ఉన్న ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి షాపుకు నిప్పు పెట్టారు. దీంతో షాపు పూర్తిగా దగ్ధమైంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అమలాపురం పట్టణంతో పాటు ఈదరపల్లిలో మొత్తం 400 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల పోలీస్ పికెటింగులు కొనసాగుతున్నాయి. హత్యకు రాజకీయ కోణం లేదని ఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.