Somireddy Fires on CM Jagan: ఒక్క అవకాశమిస్తే ఏపీని దోచిపెట్టిన జగన్ : నాలుగున్నరేళ్ల పాలనపై సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 3:50 PM IST
Somireddy Fires on CM Jagan: ఏపీకి తాను ఎందుకు కావాలో జగన్ చెప్పిన వివరాలు విని నివ్వెరపోయామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అరాచక ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చినందుకు మళ్లీ రావాలా అంటూ నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకపాలనతో అందరినీ అణగదొక్కేందుకు జగన్ మళ్లీ రావాలా అంటూ సోమిరెడ్డి మండిపడ్డారు.
రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపినందుకు జగన్ కావాలా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. లేక 10లక్షల కోట్లు అప్పు తెచ్చినందుకు కావాలా అంటూ ఎద్దేవా చేశారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాలని ముంచినందుకు కావాలా, నాసిరకం మద్యంతో మరణ మృదంగం సృష్టిస్తున్నందుకు కావాలా అంటూ నిలదీశారు. 87శాతం ప్రజలకు జగన్ బటన్ నొక్కాడో లేదో తెలీదు కానీ... 100 శాతం విద్యుత్ చార్జీలు, నిత్యావసరాలు పెంచేశారని సోమిరెడ్డి ఆరోపించారు. మద్యం, ఇసుక మాఫియాలు, బడా కాంట్రాక్టర్లు, ఆదానీ, నత్వానీ లాంటి పేదలు జగన్ పక్కన ఉన్నారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జగన్ ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించారు.