గ్రామ పంచాయతీలకు ప్రాణసంకటంగా మారిన జగన్ ప్రభుత్వ తప్పిదాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 10:00 PM IST
Prathidhwani: జగన్ సర్కారు తప్పిదాలకు ఆర్థికసంఘం నుంచి రావాల్సిన మరో 2వేల 139 కోట్లు ఆగిపోయాయి. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు జగన్ ప్రభుత్వ తప్పిదాలు ప్రాణసంకటంగా మారాయి. రాష్ట్రం చేయాల్సిన సాయం చేయకపోగా కేంద్రం ఇచ్చే నిధులకూ వైసీపీ ప్రభుత్వం ఎసరుపెట్టింది. పల్లెసీమలకు రావాల్సిన అక్షరాల 8 వేల 629 కోట్ల రూపాయలు అడ్డగోలుగా దారి మళ్లించిందని సర్పంచ్లు తల్లడిల్లుతున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో నిలిచి గెలిచిన సర్పంచ్లు నిధులు లేక నివ్వెరపోతున్నారు. పల్లెల నోటికాడ కూడు లాగేసిన జగనన్న తీరుకు నిరసనగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సైతం రోడ్డెక్కారు. నిజానికి రాష్ట్రంలో సింహభాగం పంచాయతీల్లో గెలిచింది అధికారపార్టీ మద్దతుదారులే. సొంత పార్టీ సర్పంచ్ల నిరసనలకైనా ఈ ప్రభుత్వం స్పందించిందా? వీరు నిధుల మళ్లింపు గురించి సీఎంను కానీ, సలహాదారులను కానీ కలిసి మాట్లాడలేదా? కేంద్రం నిధులు సరే పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్, మైనింగ్ సెస్, వృత్తి పన్ను, తలసరి గ్రాంట్, ఇసుకపై ఆదాయాల వాటా మాటేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.