Prathidhwani: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం స్కామ్.. ఎక్సైజ్ విధానం అసలు గుట్టేంటి?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 9:52 PM IST
Prathidhwani Debate on Liquor Scam in AP: రాష్ట్రాన్ని మద్యం కుంభకోణం ఆరోపణలు కుదిపేయనున్నాయా? రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం తెస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ నాలుగేళ్లుగా అనుసరిస్తున్న ఎక్సైజ్ విధానం అసలు గుట్టు ఏమిటి? మద్యం స్కామ్ మాటేంటి జగన్ అంటూ.. విపక్షాలు, ప్రజా సంఘాలు సంధిస్తున్న ప్రశ్నలే ఈ చర్చకు కారణం. రాష్ట్రంలో మద్యం అక్రమాలపై తప్పక సీబీఐ విచారణ కోరతామని ఇప్పటికే ప్రకటించింది ఏపీ బీజేపీ. విపక్షాలు ఆరోపిస్తున్నాయని కాకున్నా.. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు, చాలాకాలం ఆన్లైన్ చెల్లింపులకు నో చెప్పడం, ప్రముఖ బ్రాండ్లను పక్కనపెట్టడం, ఇలా ఎన్నో. వాటికి సమాధానాలెక్కడ? రాష్ట్ర ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేయటం, అది కూడా.. ప్రముఖ మద్యం బ్రాండ్లు కొన్నేళ్లపాటు కనిపించకుండా చేసి స్థానిక బ్రాండ్లు మాత్రమే అమ్మటం వెనుక మర్మం ఏంటి? పాదయాత్రలో జగన్ మద్యం అమ్మకాల గురించి, మద్యపానం అనర్థాల గురించి, మద్యాన్ని నిషేధించాల్సిన ఆవశ్యకత గురించి గొప్పగొప్ప ప్రసంగాలు చేశారు. నాలుగున్నరేళ్ల తర్వాత కూడా కనీసం ఆ దిశగా ఒక్క చర్య అయినా తీసుకున్నారా? ఇది మహిళలను మోసం చేయటం కాదా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.