Pension Fraud in YSR District: వైయస్సార్ జిల్లాలో పింఛన్ ఇవ్వకుండా మోసం.. వృద్ధ మహిళ కన్నీళ్లు
Published: Sep 13, 2023, 8:36 PM

Pension Fraud in YSR District: రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా పెన్షన్ల విషయంలో జరుగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి. కొంతమంది వాలంటీర్లు మతిస్థిమితం లేనివారికి, సరిగ్గా కనుచూపు కనబడని వృద్ధులకు నెల నెలా తక్కువ పెన్షన్ ఇస్తున్న ఘటనలు పింఛనుదారులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో ఓ వృద్ధ మహిళకు పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా, వేలిముద్రలు వేయించుకొని.. డబ్బులు ఇచ్చినట్టు ఫొటో తీయించుకుని.. చివరకు డబ్బులు ఇవ్వకుండా పంపిన సంఘటన సంచలనంగా మారింది.
Old Lady Shaikh Mairunna Appeal for Pension: వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో నివాసముంటున్న వృద్ధ మహిళ షేక్ మైరున్నీసా తనకు అక్టోబర్ నెల పెన్షన్ ఇవ్వకుండా సచివాలయ సిబ్బంది మోసం చేశారని కన్నీరుమున్నీరయ్యింది. పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా, వేలిముద్రలు వేయించుకొని.. డబ్బులు ఇచ్చినట్టు ఫొటో తీయించుకుని.. చివరకు డబ్బులు ఇవ్వకుండా పంపారని రోదించింది. గతంలో కూడా తనకు పెన్షన్ ఇచ్చే వాలంటీర్ ప్రతినెలా రూ.200, రూ.300 తక్కువగా ఇచ్చేవాడేని ఆవేదన చెందింది. తనకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులు స్పందించి..తనకు పెన్షన్ ఇప్పించాలని వేడుకుంటోంది.
Victim Woman Shaikh Mairunnasa Comments: ''అక్టోబర్ నెల పెన్షన్ కోసం ఈరోజు సచివాలయానికి వెళ్లాను. వేలిముద్రలు వేయించుకున్నారు. పింఛన్ డబ్బులు చేతిలో పెట్టి, ఓ ఫ`టో తీసుకున్నారు. చివరకు డబ్బులు ఇవ్వకుండా సచివాలయం నుంచి పంపించేశారు. నాకు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని అడిగితే.. డబ్బులు ఇచ్చామంటూ బయటికి వెళ్లిపోవాలంటూ నాపై కోపగించుకున్నారు. ఈ విషయం గురించి సచివాలయ అధికారులను చరవాణిలో వివరణ అడిగితే.. డబ్బులు ఇచ్చినట్లు వారి వద్ద ఫొటోలు ఉన్నాయని, ఆమెకు మతిస్థిమితం లేదని సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు, పెన్షన్ పుస్తకంలో 2022 నవంబర్ నుండి ఇంతవరకూ నేను తీసుకున్న పెన్షన్ వివరాలు నమోదు చేయలేదు. అదేమిటని ప్రశ్నిస్తే.. వేలిముద్ర పడుతుంది కాబట్టి పుస్తకంలో నమోదు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నన్ను కావాలనే మోసం చేశారు'' అని బాధిత వృద్ధ మహిళ షేక్ మైరున్నసా అన్నారు.