Narsipatnam municipal meeting: 'అధికార పార్టీ వివక్ష'.. చెప్పుతో కొట్టుకుని టీడీపీ కౌన్సిలర్ నిరసన
TDP councilor who hit himself with his sandal in Narsipatnam Municipal Meeting: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలు పట్టడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి విపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చినా రాజకీయాలు చేస్తోంది. అటు గ్రామాల్లో సర్పంచులను, మరోవైపు పట్టణాల్లో వార్డు కౌన్సిలర్లను వేధిస్తోంది. టీడీపీ అభ్యర్థులు గెలిచిన చోట్ల సమస్యలను ఏళ్ల తరబడి పెండింగ్ పెడుతోంది. దీంతో విసిగిపోతున్న విపక్ష పార్టీల అభ్యర్థులు అటు ప్రజలకు నచ్చజెప్పలేక, ఇటు పాలక పక్షంతో రాజీపడలేక నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం టీడీపీ కౌన్సిలర్ ప్రజా సమస్యలు పరిష్కరించలేని నిస్సహాయ స్థితిలో తనను తాను శిక్షించుకున్నాడు. సమావేశంలో తనకు తాను చెప్పుతో కొట్టుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రజా సేవ చేయడానికి వచ్చానే తప్ప.. ఆస్తులు పోగేసుకోవడానికి కాదంటూ ఆవేదన వ్యక్తం చేయగా.. పలువురు మహిళా కౌన్సిలర్లు సైతం చలించిపోయారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలిక సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సుమారు 30 నెలలు గడిచినప్పటికీ తన సొంత వార్డులో తాగునీటి కుళాయి కూడా వేయించుకోలేని దుస్థితిలో ఉన్నానని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే సమావేశంలోనే చెప్పుతో తనకు తాను కొట్టుకొని నిరసన తెలిపారు. నర్సీపట్నం మున్సిపల్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం సభ్యులు పలు అంశాలను లేవనెత్తి.. సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు. దీనిలో భాగంగానే తన వార్డులో తాగునీటి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నా.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాను ఒక్క కుళాయి కూడా వేయించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ రామరాజు చెప్పుతో కొట్టుకున్నారు.