వైసీపీ సైకోల రాజ్యంలో దాడులు సర్వసాధారణమయ్యాయి - అమెరికాలోనూ దాడులు, దందాలు : లోకేశ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 6:04 PM IST
Nara Lokesh on YCP Attacks in America: వైసీపీ కాలకేయుల రాజ్యంలో ఏపీలోనే కాకుండా, అమెరికాలోనూ దాడులు, దందాలు, కిడ్నాప్లు, సైకో చేష్టలు సర్వసాధారణం అయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. సత్తారు వెంకటేశ్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని ఎక్స్ (ట్విట్టర్)లో ప్రశ్నించారు. వైసీపీ అధినేత సైకోయిజంని మించిన సైకో ఎన్నారై సత్తారు వెంకటేశ్ రెడ్డి అని లోకేశ్ అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్, కిడ్నాప్, హింసించడం వంటి నేరాలకు పాల్పడుతోన్న వైసీపీ ముఠాల ఆట కట్టించాలని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. అమెరికాలో వైసీపీ సైకోల దుశ్చర్యల వెనుక ఉన్న పెద్ద సైకో ముఠాని బయటకి లాగి శిక్షించాలని డిమాండ్ చేశారు.
సైకో జగన్ ఆంధ్రప్రదేశ్ జనం రక్తం పీల్చుతుంటే, ఆయన అనుచర పిల్ల సైకోలు అమెరికాలో యువతపై శాడిజం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. 20 ఏళ్ల యువకుడికి బంగారు భవిష్యత్తు అంటూ ఆశ చూపించి అమెరికా రప్పించి, అక్కడ తమ అధినేత జగన్ లాగే వెంకటేష్ రెడ్డి సైకోయిజం చూపించాడని మండిపడ్డారు.