ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితిలో జగన్ : నారా లోకేశ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 3:51 PM IST
Nara Lokesh on Gundlakamma Project Gate: జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేసాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రజాధనం దోచుకోవడం, దాన్ని దాచుకోవడంలో బిజీగా ఉన్న జగన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా, ఉన్నవాటి నిర్వహణనూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందని ఆరోపించారు. గతేడాది గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయినప్పుడే అప్రమత్తమై ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేదని కాదంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
Gundlakamma Project Second Gate Washed Away: గుండ్లకమ్మ రిజర్వాయర్లో స్పిల్ వే రెగ్యులేటర్లో ఉన్న రెండోవ గేట్ శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో కొట్టుకుపోయింది. గత ఏడాది ఆగస్టు 31వ తేదీన మూడో గేట్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కందుల ఓబిల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశయం (Kandula Obula Reddy Gundlakamma Reservoir Project) గేట్లు కొట్టుకుపోతున్నాయని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.