రసాభాసగా 'జగనన్నే మా భవిష్యత్తు'.. మహిళా దళిత సర్పంచ్ను అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గం
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నవకండ్రవాడలో 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమం రసాభాసగా సాగింది. గ్రామ సమస్యలను విన్నవించుకునేందుకు సర్పంచ్ బల్ల రజిని, ఆమె భర్త సురేష్ పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే పట్టించుకోలేదని సర్పంచ్ బల్ల రజిని, ఆమె భర్త ఆగ్రహించారు. ఎమ్మెల్యేను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటాలను చేతపట్టి సర్పంచ్ రజిని, ఆమె భర్త సురేష్ ఎమ్మెల్యే దొరబాబు ఎదుట నిలబడి నిరసన తెలిపారు. గ్రామ సమస్యలపై వెంటనే స్పందించాలని కోరారు. ఎమ్మెల్యే అనుచరులు మహిళా సర్పంచ్ను పక్కకు నెట్టేశారన్నారు. దీంతో వివాదం మరింత ముదిరింది.
ఎస్సీ మహిళ కావడంతోనే వివక్ష చూపుతున్నారని సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని వారు వాపోయారు. గతంలోనూ పంచాయతీ సమావేశంలో దాడి చేశారని వారు ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గం నుంచి తమకు ప్రాణహాని ఉందని సర్పంచ్ భర్త సురేష్ అన్నారు.
TAGGED:
Sarpanch Serious On MLA