Minister Ambati Rambabu on Krishna Water కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం: మంత్రి అంబటి రాంబాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 4:02 PM IST
Minister Ambati Rambabu on Krishna Water Disputes: తెలుగు రాష్ట్రాల మధ్య గతకొన్ని నెలలుగా కృష్ణా జలాల పంపిణీపై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎట్టకేలకు నోరు విప్పారు. కృష్ణా జలాల వివాదాలు చాలా కాలంగా ఉన్నాయని అన్నారు. ఏపీకి నష్టం జరుగుతోందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్న మంత్రి అంబటి.. కోర్టులో స్టే ఉన్నందువల్ల ట్రైబ్యునల్ తదుపరి ఆదేశాలు అమలు కాలేదని పేర్కొన్నారు. కృష్ణా జలాల వివాదం గురించి తాజాగా సీఎం జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారని, ప్రధాని మోదీ లేఖ రాశారని అంబటి రాంబాబు వెల్లడించారు.
Ambati Rambabu Comments: కృష్ణా జాలాల పంపిణీ వివాదంపై మంత్రి రాంబాబు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''కృష్ణా జాలాల పంపిణీపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి నీటిబొట్టును రక్షించుకుంటాం. ఏపీ, తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలు రావాల్సిందే. 1976లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం రాష్ట్రాలు నీటిని వినియోగం చేస్తున్నాయి. కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం.. ఏపీకి నష్టం జరుగుతోందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. విభజన తరవాత బ్రిజేష్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేశారు. అందులో ఏపీకీ 511 టీఎంసీలు, తెలంగాణాకు 299 టీఏంసీల నీటిని కేటాయించారు. తాజాగా కేంద్ర తీసుకున్న నిర్ణయం తప్పు అని మేము చెబుతున్నాం.'' అని రాంబాబు అన్నారు.