Kadiyam SI Attack on Youth Case: కడియం ఘటనలో కోలుకుంటున్న వెంకట ప్రసాద్.. ఎస్సైపై తక్షణ చర్యలకు డిమాండ్
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-08-2023/640-480-19326242-707-19326242-1692682394044.jpg)
Kadiyam SI Attack on Youth Case: వివాహిత అదృశ్యం కేసు విచారణలో తూర్పు గోదావరి జిల్లా కడియం ఎస్సై కొట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఎస్సీ యువకుడు వడ్డి వెంకటప్రసాద్ కోలుకుంటున్నారు. చాగల్లులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట ప్రసాద్ను పలువురు నాయకులు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా దళిత గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు వెంకట ప్రసాద్ను పరామర్శించారు. ఎస్సై శివాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు అతనికి బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇదీ జరిగింది.. మహిళ అదృశ్యం కేసులో అనుమానితుడైన యువకుడికి వెంకటప్రసాద్ ద్విచక్రవాహనం ఇచ్చారన్న అనుమానంతో కడియం పోలీస్స్టేషన్కు అతనిని తీసుకొచ్చి, ఎస్సై విచక్షణారహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక వెంకట ప్రసాద్ కిందపడితే నాటకాలాడుతున్నావా అంటూ బెదిరించారు. అతడు కిందపడిపోతే కానిస్టేబుళ్లు నిలబెట్టగా.. ఎస్సై మళ్లీ ఛాతీపై, ముఖంపై కొట్టినట్లు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దాహం వేస్తోంది.. మంచినీళ్లు ఇప్పించమని వేడుకుంటే తన మూత్రం తాగమని ఎస్సై దారుణంగా అవమానించారని యువకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. దెబ్బలకు తాళలేక ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఎదురవ్వగా.. పోలేసులే యువకుడిని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. వివాదం బయటకు రాకుండా పెద్దల సాయంతో రాజీకి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే బాధితుడి కుటుంబసభ్యులు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టడంతో పోలీసులు ఎట్టకేలకు అతనిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు.