Flood at Polavaram: ఎగువ నుంచి వరద.. పోలవరం దగ్గర పెరిగిన ప్రవాహం
Flood for Polavaram Project: ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద ప్రవాహంతో గోదావరిలోని నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 27.85 మీటర్లకు చేరింది. రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా మొన్నటి వరకు బయటకు వచ్చిన వరద.. ప్రస్తుతం స్పిల్ వే క్రస్ట్ గేట్ల ద్వారా వెళ్తోంది. ప్రాజెక్టులోకి వరద నీరు చేరటంతో 42 గేట్లు ఎత్తి లక్షా 15 వేల 136 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. శుక్రవారం నాటికి పోలవరం ప్రాజెక్ట్ ఎగువ కాఫర్ డ్యాం పైభాగంలోని గోదావరి నిండుకుండలా కనిపించింది. వీరవరపులంక, పూడిపల్లి పరిసర ప్రాంతాలలో ఉన్న ఇసుక తిన్నెలు పూర్తిగా నీటమునిగాయి. పాపికొండల విహార యాత్రను కూడా అధికారులు నిలిపేశారు. దండంగి, డి. రావిలంక గ్రామాల మధ్య పంట భూములను వరద ప్రవాహం ముంచెత్తింది.