విశాఖ ఎల్జీ పాలిమర్స్ తరలింపుపై హైకోర్టులో ముగిసిన వాదనలు - తీర్పు రిజర్వ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 3:30 PM IST

thumbnail

HC on Visakha LG Polymers Incident: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌కు చెందిన.. ఇంజినీరింగ్‌ ప్లాస్టిక్‌ కాంపౌండింగ్‌ ప్లాంట్‌ను వేరే ప్రాంతానికి తరలించేందుకు అనుమతివ్వాలంటూ.. ఆ సంస్థ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యవహారంపై డిసెంబర్‌ 7న నిర్ణయం ప్రకటిస్తామని న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ప్రకటించింది. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనను సుమోటోగా తీసుకొని న్యాయస్థానం విచారణ జరుపుతోంది. బాధితులకు పరిహారం పెంచాలని, పూర్తిస్థాయి వైద్యం అందించాలని, బాధితులకు కంపెనీ పరిహారం అందించేలా ఆదేశించాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని, గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ప్రజాహిత వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి.

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని శ్రీ సిటీలోకి ఈపీసీ ప్లాంటును మార్చుకునేందుకు ఆ సంస్థ డిప్యూటీ మేనేజర్‌ పీ.అరుణ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు బాధితుల పరిహారం కోసం విశాఖ కలెక్టర్‌ వద్ద 143 కోట్ల రూపాయలు జమచేశామని కోర్టుకు తెలిపారు. ప్లాంటును రీలొకేట్‌ చేసేందుకు సుప్రీంకోర్టు, ఎన్​జీటీ నుంచి ఎలాంటి అడ్డంకి లేదన్నారు. కోర్టు గతంలో ప్రతిపాదించిన మేరకు సముద్రమార్గం ద్వారా ప్లాంట్‌లోని యంత్రాలు, సామగ్రిని తరలించేందుకు సాధ్యంకాదన్నారు. నిపుణుల పర్యవేక్షణలో రోడ్డు మార్గంలోనే తరలించాల్సి ఉందన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తరలింపు ప్రక్రియ చేపడతామన్నారు. ప్రభుత్వం విధించే షరతులకు కట్టుబడి ఉంటామన్నారు. అమికస్‌క్యూరీ తరఫున వైవీ.రవిప్రసాద్, రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రత్యేక జీవీ. సుమన్‌ వాదనలు వినిపించారు. తమ షరతులకు లోబడి పరిశ్రమ తరలిస్తే అభ్యంతరం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.