సాగునీటి కోసం కావలి నియోజకవర్గ రైతుల ఇబ్బందులు, కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన టీడీపీ నేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 9:46 PM IST
Farmers Problems for Irrigation Water: తమ సాగునీటి కష్టాలు తీర్చాలని కావలి నియోజకవర్గం రైతుల ఆవేదన చెందుతున్నారు. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చి.. తమకు నీరివ్వాలని కోరారు. నీరిస్తే లక్ష ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఈ సీజన్లో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. సోమశిల జలాశయంలో ఉన్న 30 టీఎంసీల్లో 7 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంచుతారని.. మిగిలిన 23 టీఎంసీల్లో కొంత భాగం సాగు నీటి కాలువలకు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కావలి నియోజకవర్గ రైతులు, టీడీపీ నాయకులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. జాయింట్ కలెక్టర్ని కలిసి వారి కష్టాలను వివరించారు. సంగం బ్యారేజి నుంచి 60 కిలోమీటర్లు దూరం.. పాపిరెడ్డి కాలువ వరకు కాలువలు సరిగా లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పూడికలు తీయలేదని తెలిపారు. మరో వారం రోజుల్లో పంటల సాగుకు నార్లు పోసుకుంటామని.. నీళ్లు విడుదల చేయాలని రైతులు కోరారు. ఈ మేరకు కలెక్టక్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చి.. వినతిపత్రం ఇచ్చారు.