ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నుంచి వేధింపులు - సీఎం జగన్ ఆఫీస్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 6:01 PM IST
Family Suicide Attempt at CM Camp Office: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Gopireddy Srinivasareddy) వేధిస్తున్నారని ఓ కుటుంబం సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. నరసరావుపేటకు చెందిన సాంబశివరావు కుటుంబం పెట్రోల్ పోసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బాధితుల నుంచి పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
2021లో గుంటూరుకు చెందిన వ్యక్తి వద్ద 6 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసినట్లు సాంబశివరావు తెలిపారు. ఆ పొలం ధర పెరగడంతో విక్రయదారుడు రిజిస్ట్రేషన్ చేసేందుకు విముఖత చూపడంతో నరసరావుపేట ఎంపీని ఆశ్రయించడంతో పొలం రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. సమస్యను పరిష్కరించినందుకు ఎంపీ డబ్బులు అడగలేదు కాబట్టి తనకు 16 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బెదిరిస్తున్నారని సాంబశివరావు, అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొనుగోలు చేసిన 6 ఎకరాలను కూడా గోపిరెడ్డి తన మనుషులతో కబ్జా చేశారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సాంబశివరావు కుటుంబసభ్యులతో మాట్లాడిన పోలీసులు న్యాయం చేస్తామని వారిని జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.