EPS 95 Pensioners Protest in Vijayawada: రూ.9 వేలు పింఛన్ ఇవ్వాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల డిమాండ్
protest of EPS 95 Pensioners in Vijayawada : ఈపీఎస్ 95 పింఛన్దారులకు నెలకు రూ. 9 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విజయవాడలోని ధర్నా చౌక్లో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈపీఎస్ 95 పింఛన్దారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పింఛన్దారులకు నెలకు మూడు వేల రూపాయల కనీస పింఛన్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. పది సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ హామీ అమలు చేయలేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోయేషన్ అధ్యక్షులు జీవరత్నం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల సంస్థల్లో 40 సంవత్సరాలు పనిచేసి దేశానికి సేవ చేసిన వారికి ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు వృద్ధాప్య, వితంతు పింఛన్లు నెలకు మూడు వేల రూపాయల వరకు ఇస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఎవరైతే మమ్మల్ని గుర్తు పెట్టుకుని గౌరవిస్తారో.. వాళ్లకే మా అమ్యూలమై ఓటు వేసి వారినే గద్దెను ఎక్కిస్తామని అన్నారు. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని, రద్దు చేసిన కమ్యూటేషన్ కార్యకలాపాలను పునరుద్ధరించాలన్నారు. రైల్వేలలో పెన్షనర్లకు, వృద్ధులకు 50 శాతం రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ప్రతి నెల ఒకటవ తారీఖున పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.