Dy CM Narayana Swamy Controversy సార్.. ఇసుక ధర తగ్గించండి..! ఇంకా పెంచుతాం.. ఏం చేసుకుంటావో చేస్కో! డిప్యూటీ సీఎం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 12:05 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2023/640-480-19335293-thumbnail-16x9-protest-against-narayana-swamy.jpg)
Dy CM Narayana Swamy Controversy సార్ ఇల్లు నిర్మించుకోవడానికి కావలసిన ఇసుక మూడున్నర వేలకు దాటిందని ఇలాగైతే పేదలు ఇల్లు ఎలా కట్టుకోవాలని మాజీ ఎంపీటీసీ సభ్యుడు అడగగా.. దానిని 5 వేలు చేస్తామంటూ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి బదులిచ్చారు. చిత్తూరు జిల్లా పెనమలూరు మండలం కలవకుంట పంచాయతీలో నారాయణ స్వామి గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ స్వామిని ఇసుక రేటుపై మాజీ ఎంపీటీసీ సభ్యుడు అబ్దుల్ సలాం ప్రశ్నించారు. ఇసుక రేటు మూడున్నర వేలకు దాటిందని ఇల్లు ఎలా కట్టుకోవాలంటూ ప్రశ్నించగా.. దానిని 5 వేలు చేస్తామంటూ ఉప ముఖ్యమంత్రి బదులిచ్చారు. అంటే మేము ఇల్లు కట్టుకోవద్దా అంటూ సలాం అడగ్గా.. చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడంటూ నారాయణ స్వామి తిరిగి ప్రశ్నించారు. చంద్రబాబు ఇసుకను ఉచితంగా ఇచ్చారని సలాం చెప్పగా.. దోపిడీ చేశారంటూ ఉప ముఖ్యమంత్రి విమర్శించారు. దానికి ఎవరు దోపిడీ చేస్తున్నారో తెలుసంటూ సలాం బదులిచ్చారు. మండల పరిధిలోని సన్యాసింపల్లి పాఠశాలలో విద్యార్థులు తమకు పాఠశాల భవనం పెచ్చులూడి ప్రమాదకరంగా ఉందంటూ, తమకు హెల్మెట్లే రక్షణ అంటూ హెల్మెట్లు ధరించి నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఉప ముఖ్యమంత్రి అటువైపు వెళ్ళకుండా తన పర్యటనను మార్చుకున్నారు.