Drought Conditions in Bapatla: డెల్టాలో కరవు ఛాయలు..! కళ్లెదుటే ఎండుతున్న పంటలు చూసి అన్నదాత కన్నీళ్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 4:03 PM IST
Drought Conditions In Bapatla District : బాపట్ల జిల్లాలో సాగు నీటి కొరత కారణంగా వేలాది ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయి. పచ్చని పైరు కళ్ల ముందే ఎండిపోవడంతో, పొలాలను రక్షించుకునేందుకు రైతులు డీజిల్ ఇంజిన్లతో భూములకు నీటిని అందిస్తున్నారు. కాలువ చివరి ఆయకట్టుకు దూరంగా ఉన్న పొలాలకు నీరందక పోవడంతో దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల డెల్టా చివరి ఆయకట్టులోకి నీటి ప్రవాహం లేకపోవడంతో జిల్లాలో ఖరీఫ్ వరిసాగు 60 శాతం విస్తీర్ణం తగ్గింది.
కృష్ణ పశ్చిమ డెల్టాల్లో కొమ్మమూరు కాలువ పరిధిలో ఆయకట్టు ఉంది. కొమ్మమూరు కాలువ పూర్తి నీటి సామర్థ్యం 3500 క్యూసెక్కులు, కానీ ప్రస్తుతం 800 క్యూసెక్కులతో 20 శాతం నీరు మాత్రమే వస్తోంది. సాగర్ పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటం వల్ల, కాలువలకు నీటి విడుదల పెంచలేకపోతున్నామని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే సాగు కోసం ఎకరాకు రూ.15000 నుంచి రూ.20,000 ఖర్చు చేశామని రైతులు చెప్పారు. పంటలకు నీరందకపోతే దిగుబడులు తగ్గి, సాగు కోసం పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోతామని రైతులు వాపోతున్నారు.