తుపాన్ నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి - జగన్ ఇప్పటికైనా రైతుల కష్టాలు తెలుసుకో : సీపీఐ ఆర్కే
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 4:29 PM IST
CPI Secretary visited Eluru Cyclone Affected Areas: ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని స్థితిలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. తుపాను ముప్పును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో పలు గ్రామీణ మండలాలైన చాటపర్రు, తిమ్మారావుగూడెంలో రాష్ట్ర నాయకులతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మిగ్జాం తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.40 వేలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Government Provide Compensation to Support Farmers: ఏలూరు జిల్లాలో మిగ్జాం తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, నీట మునిగిన వరి పనలు, ధాన్యం రాశులను రామకృష్ణ పరిశీలించారు. అనంతరం బాధిత రైతాంగాన్ని పరామర్శించి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో విపత్తు సంభవించింది రైతులను భారీ నష్టాన్ని కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు.