టీడీపీ, జనసేన అధికారంలోకి రావాల్సిందే - నేను కూడా సంతోషిస్తా : సీపీఐ రామకృష్ణ
CPI Ramakrishna Interesting Comments in BCs Meeting: బీసీల సమస్యలపై విజయవాడలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం- జనసేన అధికారంలోకి రావాలని సీపీఐ నేతగా కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సీపీఐ- సీపీఎం కూడా అసెంబ్లీలో ఉంటేనే ప్రశ్నించే గొంతుకలుండి అధికారపక్షం సక్రమంగా నడుస్తుందన్నారు.
వైసీపీని నడిపే నలుగురు కీలక నేతలు జగన్ సామాజిక వర్గమే అని విమర్శించారు. రాష్ట్రంలో పేరుకు మాత్రమే సామాజిక న్యాయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టిన వీళ్లు సిగ్గులేకుండా సామాజిక సాధికార యాత్ర అంటున్నారని వైసీపీ నేతలను దుయ్యబట్టారు. కీలకమైన ఒక పోస్టయినా బీసీ, ఎస్సీలకు ఇచ్చి వారికి జగన్ విలువ ఇచ్చాడా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా వైసీపీ అరాచక పాలనపట్ల విసిగిపోయారని, త్వరలోనే తగిన బుద్ది చెప్తారని అన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించడానికి అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు.