తుపాను బాధితులను ఆదుకోకపోతే ప్రత్యక్ష ఆందోళన తప్పదు : సీపీఐ నారాయణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 5:20 PM IST
CPI Narayana on YCP Government About Cyclone Effect: తుపాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తుపాను బాధితులను ఆదుకోవాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తుపానుతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్రంలో కరువు, అధికవర్షాలతో రైతులు తీవ్ర ఇబందులు ఎదుర్కొంటున్నారని నారాయణ తెలిపారు. ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మిగ్జాం తుపానును (Michaung Cyclone Effect in AP) జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులకు సహయం చేయాలని కోరారు. తుపాన్ నష్టాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందానికి ప్రభుత్వం ఎటువంటి వినతులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసిన జగన్ సీఎం అయ్యాక ప్రజల మద్దతు ఉందంటూ జనాల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వరద భాదితులను ఆదుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.