మద్యం మత్తులో ఇంటర్ విద్యార్థి ప్రాణాలు బలిగొన్న కానిస్టేబుల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 3:35 PM IST

thumbnail

Constable Took Life Of Inter Student Alcohol Consumption: మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఇంటర్‌ విద్యార్థి ప్రాణాలు తీసాడు కానిస్టేబుల్. విద్యార్థి ప్రాణాలు బలి తీసుకున్న కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి జిల్లా మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలో సత్య వరప్రసాద్‌(16) ఇంటర్‌ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం ప్రసాద్ అతని స్నేహితుడు కలిసి బయటకు వెళ్లిన సమయంలో అతివేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో ప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి హరిగోపాల్‌ గాయాల పాలయ్యాడు.  

మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జి. ఉదయ్‌భాస్కర్‌ మద్యం సేవించి ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని విచారణలో తేలింది. నిందితునిపై చర్యలు తీసుకుని విద్యార్థి కుటుంబానికి ₹.25 లక్షల పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం రంపచోడవరం ఆసుపత్రి ఎదుట ప్రజాసంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. గిరిజన విద్యార్థి దుర్మరణం పాలైతే ఉన్నతాధికారులెవరూ స్పందించకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ జగదీష్‌ అడహళ్లి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాన్‌రాజ్‌, మారేడుమిల్లి సీఐ భీమరాజు, ఎస్సై రాము ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశామని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఏఎస్పీ తెలిపారు. తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని లేకుంటే ఆందోళన కొనసాగిస్తామని చెప్పటంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికిప్పుడు తామేమీ చేయలేమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత తమదని డీడీ చెప్పడంతో ఆందోళన విరమించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.