CFD Meets SEO: ఓటర్ల జాబితాలో వారి జోక్యాన్ని తప్పించాలి.. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన 'సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ'
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 4:53 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-10-2023/640-480-19670570-thumbnail-16x9-cfd-meets-ap-ceo.jpg)
CFD Meets AP CEO: ఓటర్ల జాబితాలో అవకతవకల అంశంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసి ఫోరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకి విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. సీఎఫ్డీ తరపున విజ్ఞాపన పత్రాన్ని ఆ సంస్థ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సీఈఓకి ఇచ్చారు. ఈ వినతిపత్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఉపాధ్యాయులకు ఇవ్వాలనీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రస్తుతం ఈ ప్రక్రియను చేపట్టినా గ్రామ సచివాలయం ఉద్యోగులకు అనుభవ రాహిత్యం వల్ల.. జాబితాలో తప్పులు దొర్లుతున్నాయని సీఎఫ్డీ పేర్కొంది. దీంతో కీలకమైన ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లుతున్నాయని పేర్కొంది. ఈ కారణంగా ఓటర్లు 'రైట్ టూ ఓట్' అనే ముఖ్యమైన అంశాన్ని కోల్పోతున్నారని తెలిపింది.
పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు, ఒకే డోర్ నంబర్ పై వందలాది ఓటర్ల నమోదు లాంటి అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసి పేర్కొంది. ఇటీవల కాగ్ నుంచి కూడా గ్రామ సచివాలయ వ్యవస్థపై అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో ఓటర్ల జాబితా రూపకల్పనలో వారి జోక్యాన్ని తప్పించాలని సీఎఫ్డీ కోరింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన కాకుండా.. ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని సీఎఫ్డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు నిమ్మగడ్డ తెలిపారు.