Centenary celebrations: రాజగోపాలరావు ఆశయసాధనకు పాటుపడదాం.. ఘనంగా శతజయంత్యుత్సవాల ముగింపు సభ
Boddepalli Rajagopala Rao centenary celebrations: స్వర్గీయ పార్లమెంటు సభ్యుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు.. విశిష్టమైన వ్యక్తి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానంలో స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి ముగింపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడు రోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎంపీ విగ్రహాన్ని సభాపతి తమ్మినేని సీతారాంతో కలిసి.. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. టీడీపీ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవి కుమార్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాజకీయ నాయకులందరిలో జల్లెడ వేస్తే అందులో అరుదైన నాయకులు కొంత మంది వస్తే అందులో బొడ్డేపల్లి రాజగోపాలరావు లాంటి నాయకులు ఉంటారని కొనియాడారు. ఇలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని అన్నారు.. 1952 నుంచి 1984 వరకు ఆరు సార్లు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనప్పటికీ.. మచ్చలేని వ్యక్తిగా జనం గుండెల్లో విశ్వవిజేతగా నిలిచారని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మూడున్నర దశాబ్దాలు పార్లమెంటు సభ్యుడుగా కొనసాగిన బొడ్డేపల్లి రాజగోపాలరావు.. ఆశయాలను నెరవేరుద్దామని నాయకులు పేర్కొన్నారు.