Boat Capsized in the Sea: సముద్రంలో పడవ బోల్తా.. ఇద్దరు చిన్నారులతో సహా తల్లి గల్లంతు
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-08-2023/640-480-19314903-thumbnail-16x9-boat-capsized.jpg)
Boat Capsized in the Sea Mother and Two children Missing: పడవ బోల్తా పడి తల్లితో సహా ఇద్దరు చిన్నారులు గల్లంతైన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. నాగాయలంక మండలం ఎలచెట్లదిబ్బ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సోంబాబు భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని.. ముత్తాయపాలెం వద్ద బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. నిజాంపట్నం హార్బర్ తీర సమీపానికి రాగానే.. పడవ బోల్తాపడింది. దీంతో బోటులో ఉన్న వారందరూ సముద్రంలో పడిపోయారు. బోటులోని భార్య సాయి వర్ణిక (25) , కుమారులు తనీష్ కుమార్ (7), తరుణేశ్వర్ (1) సముద్రంలో గల్లంతయ్యారు. భర్త సోంబాబు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. వేటకు వెళ్లిన మత్స్యకారులు బోల్తాపడిన బోటును చూసి మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఒడ్డుకు చేరుకున్న భర్త.. అలల ఉద్ధృతికి పడవ బోల్తా పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం.. మత్స్యకారుల సహాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు.