సమస్యల పరిష్కారానికి ఉద్యోగులంతా కలిసి ముందుకు రావాలి: బొప్పరాజు
Published: Nov 14, 2023, 5:08 PM

AP JAC Chairman Bopparaju Venkateshwarlu: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి ముందుకు రావాలని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం.. ఏపీ జేఏసీ అనుబంధ సంఘం.. డిసెంబర్ 10వ తేదీన విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్లో బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు సంబంధించిన గోడ పత్రికను బొప్పరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే ఉద్యోగుల బలమేంటో ప్రభుత్వానికి తెలుస్తుందని.. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని పిలుపునిచ్చారు.
AP Contract Outsourcing Employees Open Meeting: ఉద్యోగ భద్రత లేదని, కనీస వేతనం లభించడం లేదని, సమాన పనికి సమాన వేతనం కూడా అందడం లేదని.. సమస్యలతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వారి సమస్యల పరిష్కారానికి అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు. ఐకమత్యంగా ముందుకు సాగేందుకు మహాసభ ఒక వేదిక కానుందని బొప్పరాజు అన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సభకు ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించినట్లు వివరించారు. వారు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.