Minister Buggana on State debt: రాష్ట్ర అప్పు కేవలం రూ. 4.41 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
Minister Buggana Rajendranath Reddy key comments on state debt: ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో చేసిన అప్పు కేవలం 4.41 లక్షల కోట్లేనని వ్యాఖ్యానించారు. అప్పుల విషయంలో ప్రతిపక్షాలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి రాష్ట్ర అప్పులపై సమాధానాలు ఇచ్చారన్న బుగ్గన.. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన అప్పుల వివరాలను వివరించారు.
అన్ని రాష్ట్రాలకు వర్తించే నిబంధనలే ఏపీకి.. రాష్ట్ర సచివాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''రాష్ట్ర అప్పులపై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ ఎంపీలు వేస్తున్న ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి సమాధానాలు ఇచ్చేశారు. కేంద్ర మంత్రి ఇచ్చిన లెక్కల ప్రకారం.. రాష్ట్ర అప్పు మొత్తం రూ.4.41 లక్షల కోట్లు మాత్రమే.. అందరూ ఆరోపిస్తున్న రూ.10 లక్షల కోట్లు ఏమైంది..? ఏపీకి కేంద్రం సహకారం అందకూడదనే ఫిర్యాదులు చేశారు. ఎవరో సంబంధం లేని వ్యక్తులు అప్పులని చెబితే వింటారా..? అన్ని రాష్ట్రాలకు వర్తించే నిబంధనలే ఏపీకి వర్తిస్తున్నాయి. అప్పుల విషయంలో ప్రతిపక్షాల్లో ఒక్కొక్కరిది ఒక్కో మాట. వీటన్నింటికీ కేంద్రం పార్లమెంటులో సమాధానం చెప్పింది. రాష్ట్రం అప్పు కేవలం రూ.4.41 లక్షల కోట్లు మాత్రమే'' అని మంత్రి బుగ్గన అన్నారు.