Pattabhi on State Debt: జగన్ ప్రభుత్వం రూ.10.77లక్షల కోట్లు అప్పు చేసింది: పట్టాభిరామ్
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-07-2023/640-480-19046860-134-19046860-1689837706140.jpg)
TDP spokesperson Pattabhiram comments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లలో రూ.10.77లక్షల కోట్ల అప్పు చేసిందని.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. గతకొన్ని నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు రాష్ట్ర అప్పులపై పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా.. అప్పుల మీద అప్పులు చేస్తూ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూలై 18వ తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.10.77లక్షల కోట్ల అప్పు చేసినట్లు తాజాగా బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ధారించిన వివరాలను పట్టాభిరామ్ వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది.. రాష్ట్ర అప్పులపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''రాష్ట్రం అప్పు రూ.10 లక్షల కోట్లు దాటిందని మీడియా ద్వారా పలుమార్లు మేము ప్రజలకు తెలియజేశాము. దీంతో అధికార పార్టీ నాయకులు, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన.. అవన్నీ అవాస్తవాలు అంటూ బుకాయించారు. కానీ, నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బయటపెట్టిన వివరాలపై ఏం సమాధానం చెప్తారు బుగ్గన గారు..?. జూలై 18 వరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.10.77లక్షల కోట్లు అప్పు చేసినట్లు బీజేపీ రాష్ట్ర శాఖ కూడా నిర్ధారించింది. కేంద్ర ఆర్థిక శాఖ నివేదికల ఆధారంగానే బీజేపీ ఆ వివరాలను వెల్లడించింది. పురందేశ్వరి బయటపెట్టిన వివరాలను బుగ్గన, దువ్వూరి కృష్ణలు తప్పని చెప్పగలరా..?, గాడి తప్పిన రాష్ట్ర అప్పులపై గతంలో తెలుగుదేశం బయటపెట్టిన వివరాలనే పురందేశ్వరి కూడా బయటపెట్టారు. మితిమీరిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.'' అని ఆయన అన్నారు.